అది దురుద్దేశాల నివేదిక

9 Jul, 2019 04:01 IST|Sakshi

కశ్మీర్‌లో పరిస్థితిపై ఐరాస నివేదికపై భారత్‌ మండిపాటు

న్యూఢిల్లీ/జెనీవా: కశ్మీర్‌లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్‌ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కశ్మీర్‌లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అటు పాకిస్తాన్‌ లేదా ఇటు ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారు..
‘భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కశ్మీర్‌లో మూల సమస్య అయిన సీమాతంర ఉగ్రవాదాన్ని విస్మరిస్తూ ఈ నివేదికను రూపొందించారు. పాక్‌ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదుల వల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు. ఇండియాకు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించే పాకిస్తాన్‌కు మధ్య కృత్రిమ పోలిక తేవాలన్న ప్రయత్నం ఈ తాజా నివేదికలో కనిపిస్తోంది. దీనిపై ఐరాస మానవహక్కుల కార్యాలయానికి ఇండియా తన తీవ్ర నిరసనను తెలిపింది. నివేదికను ఇలా విడుదల చేయడం వల్ల ఐరాస విశ్వసనీయత, చిత్తశుద్ధి దెబ్బతింది. భారత విధానాలు, ఆచరణలు, విలువలను విస్మరించిన ఈ నివేదిక తన విశ్వసనీయతనే ప్రమాదంలోకి నెట్టుకుంది’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు