కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం

24 Mar, 2020 08:31 IST|Sakshi

జెనీవా : మహమ్మారి కోవిడ్-19 (కరోనా వైరస్) తో వణికిపోతున్న  భారతీయులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) భారీ ఊరటనిచ్చే కబురు చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశానికి అద్భుతమైన సామర్థ్యం ఉందంటూ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా స్మాల్-పాక్స్, పోలియో లాంటి రెండు మహమ్మారులను విజయవంతంగా తరిమికొట్టిన అద్భుతమైన అనుభవం ఉన్న భారత్ కరోనాను కూడా నిర్మూలించ కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ మంగళవారం చెప్పారు.

జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో ఈ వైరస్ ఎక్కువ కాలంవుండే అవకాశం వుంటుందన్నారు. రెండు మహమ్మారిని నిర్మూలించడంలో భారతదేశం ప్రపంచాన్ని నడిపించింది, కాబట్టి భారతదేశానికి ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనే సత్తా,  సామర్థ్యం ఉందన్నారు. అయితే పెద్ద సంఖ్యలో ల్యాబ్‌లు  చాలా అవసరమని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిపై  నిర్వహించే రోజువారీ విలేకరుల సమావేశంలోజె ర్యాన్  ఈ వ్యాఖ్యలు చేశారు. సులభమైన  పరిష్కారాలు లేనప్పటికీ భారత్  లాంటి దేశాలు ఇంతకుముందు చేసినట్లుగా ప్రపంచానికి మార్గం చూపించడం చాలా ముఖ్యమైందని ఆయన అన్నారు. (కరోనా అలర్ట్‌ : మూడో దశకు సిద్ధమవ్వండి!)

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 3,30,000 దాటింది, మరణాల సంఖ్య 14వేలు దాటింది. అయితే  కరోనా వ్యాప్తిలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను, రక్షణ సూచలను ప్రతీ పౌరుడు తు.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందని నిపుణులు సూచిస్తున్నారు.  వేగంగా విస్తురిస్తున్న కరోనాకు  చెక్ పెట్టే చర్యల్లో భాగంగా అమలు  చేస్తున్న లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకొని విధిగా ఆచరించాలని గుర్తు చేస్తున్నారు.(భారత్‌ కృషి ప్రశంసనీయం: డబ్ల్యూహెచ్‌ఓ)


 

మరిన్ని వార్తలు