ఏడాదికో కొత్త షికాగో నిర్మిస్తేనే!

13 Jul, 2018 03:44 IST|Sakshi
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ

భారత్‌లో పట్టణీకరణ లక్ష్యాలపై కేంద్రమంత్రి హర్‌దీప్‌ వ్యాఖ్య

న్యూయార్క్‌: పట్టణీకరణ విషయంలో భారత్‌ అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు 2030 వరకు ఏడాదికో కొత్త షికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ అన్నారు. 2030 కల్లా భారత జనాభాలో 40%మంది పట్టణాల్లో నివసిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సమ్మిళిత అభివృద్ధిపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హర్‌దీప్‌ మాట్లాడారు.

భారత పట్టణీకరణ లక్ష్యాలను చేరుకునేందుకు నేటినుంచి 2030 వరకు ప్రతి ఏటా 70 నుంచి 90 కోట్ల చదరపు మీటర్ల పట్టణాభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. మిషన్‌ 2030లో భాగంగా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే పట్టణీకరణ కోసం 70% కొత్త మౌలికవసతులను భారత్‌ ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని పురీ తెలిపారు. 1947లో భారత జనాభాలో 17% పట్టణాల్లో నివసిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30% ఉంది. 2030 కల్లా ఇది 40%కు చేరవచ్చని అంచనా.

>
మరిన్ని వార్తలు