అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు

23 Nov, 2018 04:59 IST|Sakshi

న్యూయార్క్‌: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన ‘పాస్‌పోర్ట్‌ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్‌పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్‌పోర్ట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలోనూ పాస్‌పోర్ట్‌ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్‌పోర్టు రెన్యువల్‌ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. 

మరిన్ని వార్తలు