భారత్‌ పాక్‌ మధ్య మాటల యుద్ధం

20 Apr, 2020 08:53 IST|Sakshi

భారత్‌పై ఇమ్రాన్‌ అసత్య ఆరోపణలు

సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే పాకిస్తాన్‌ మాత్రం మరోసారి తన వక్ర బుద్ధిని చూపింది. ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ ప్రభుత్వం అసత్య ఆరోపణలకు దిగారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇమ్రాన్‌ మాటల యుద్ధానికి దిగారు. అలాగే దేశంలో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు సరైనది కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. భారత్‌లో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ ఉద్దేశపూర్వకంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.

పాకిస్తాన్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టలేకనే భారత​ ప్రభుత్వంపై ఇమ్రాన్‌ దిగాజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలను తిప్పికొట్టింది. పాక్‌లో కరోనా బారినపడిన వారికి కనీస వైద్య సదుపాయాలు లేవని వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్‌ ఇచ్చింది. ఇతర దేశాలపై లేనిపోని ఆరోపణలు చేసే బదులుగా సొంత దేశ ప్రజలను ఆదుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్‌పై ఇమ్రాన్‌ ఇప్పటికే అనేక సార్లు మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు