అనూహ్యం: పదవి నుంచి వైదొలిగిన సీమా నంద

25 Apr, 2020 17:33 IST|Sakshi

డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ సీఈఓ పదని నుంచి సీమా నంద నిష్క్రమణ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన, భారత సంతతి న్యాయవాది సీమా నందా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.  డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ(డీఎన్‌సీ) సీఈఓగా వ్యవహరిస్తున్న ఆమె తన పదవి నుంచి వైదొలిగారు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం సీమా వెల్లడించలేదు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న 48 ఏళ్ల సీమ.. 2018లో డీఎన్‌సీ సీఈఓగా ఎన్నికయ్యారు. తద్వారా ఈ పదవిని అలంకరించిన తొలి ఇండో- అమెరికన్‌గా నిలిచారు. ‘‘రెండేళ్ల తర్వాత డీఎన్‌సీ సీఈఓ పదవి నుంచి నిష్క్రమిస్తున్నాను. నేను సమకూర్చిన మౌలిక సదుపాయాల కంటే ఓ బృందంగా మేము చేసిన దాని పట్ల సంతోషంగా ఉంది’’అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు నా పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. (ప్రమాదకర సలహాలు.. మాట మార్చిన ట్రంప్‌!)

కాగా డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బిడెన్‌ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేందుకే సీమా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక జో బిడెన్‌ క్యాంపెయిన్‌ కోసం 3,60,600 అమెరికా డాలర్ల నిధులు సేకరించడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి‘‘బిడెన్‌ విక్టరీ ఫండ్‌’’అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డీఎన్‌సీ తెలిపింది. ఇక సీమా నంద స్థానంలో మేరీ బెత్‌ కాహిల్‌ డీఎన్‌సీ సీఈఓగా ఎన్నిక కానున్నట్లు సమాచారం. కాగా సీమా నంద తల్లిదండ్రులు దంత వైద్యులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కనెక్టికట్‌లో పెరిగారు. బ్రౌన్‌ యూనివర్సిటీలో చదివారు. బోస్టన్‌ కాలేజీ లా స్కూల్‌ నుంచి పట్టా పుచ్చుకున్నారు. సివిల్‌ రైట్స్‌ డివిజన్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సంస్థలో పనిచేశారు. (సౌదీ కీలక నిర్ణయం.. మరో సంస్కరణ!)

మరిన్ని వార్తలు