ఇండియన్‌ వైద్య విద్యార్థి హత్య

15 Jul, 2017 20:59 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తనతోపాటే ఉంటున్న ఓ యువకుడు ఓ భారతీయ మెడికల్‌ విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర కత్తిపోటు గాయాలతో మెడికల్‌ విద్యార్థి చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అతీఫ్‌ షేక్‌ అనే మెడికల్‌ విద్యార్థి విన్సన్‌ మెయిస్నామ్‌ సింగ్‌(23) అనే వ్యక్తితో కలిసి ఢాకాలోని అక్బర్‌ షా అనే ప్రాంతంలోని ఓ ఆరంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు.

అతడు చిట్టగాంగ్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తొలుత సింగ్‌, అతీఫ్‌ మధ్య గొడవ ప్రారంభమై అనంతరం కత్తిపోట్ల వరకు దారి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, వీరితోపాటు మరో ఇద్దరు కూడా ఉంటున్నారని చెప్పారు. వారిలో ఒక యువతి కూడా ఉన్నారని తెలిపారు. వీరంతా కూడా మణిపూర్‌కు చెందిన వారని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన అనంతరం సింగ్‌ ఉరేసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన తోటి ఇద్దరు అతడిని అడ్డుకున్నారని, కత్తిపోట్లకు గురైన అతీఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు