అందరూ చూస్తుండగా అఘాయిత్యం

28 Oct, 2016 15:55 IST|Sakshi
అందరూ చూస్తుండగా అఘాయిత్యం

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని బిస్బేన్ నగరంలో పంజాబ్ కు చెందిన బస్సు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే అతడిని సజీవ దహనం చేశాడో దుండగుడు. బిస్బేన్ సిటీ కౌన్సిల్ డ్రైవర్ గా పనిచేస్తున్న మాన్మీత్ ఆలిషెర్(29)పై దుండగుడు మండేస్వభావం ఉన్న ద్రవం పోశాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో కాలిన గాయాలతో బస్సులోనే మాన్మీత్ ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. భయాందోళనకు గురైన బస్సులోని ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా పారిపోయారని వెల్లడించారు.

అయితే బస్సు మొత్తానికి మంటలు అంటుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ దాడికి సంబంధించి 48 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఇది జాత్యంహకార, తీవ్రవాద దాడి కాదని పోలీసులు స్పష్టం చేశారు. మంచి గాయకుడిగా కూడా ప్రసిద్ధుడైన మాన్మీత్ ఆలిషెర్ మరణం పట్ల ప్రవాస పంజాబీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు