‘చచ్చిబతికాను.. వాళ్లే హీరోలు’

9 Apr, 2020 13:50 IST|Sakshi

కరోనా అనుభవాలు పంచుకున్న మహిళ

లండన్‌: ‘‘శ్వాస తీసుకోవడం, వదలడం సాధారణ ప్రక్రియ.. కానీ ఇప్పుడు ఉచ్ఛాస, నిశ్వాసలు ఎలా ఉంటాయోనన్న విషయం గుర్తుచేసుకోవాల్సి వస్తోంది’’ అంటూ భారత సంతతికి చెందిన రియా లఖానీ కరోనా అనుభవాలు పంచుకున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా తన భర్త, తల్లిదండ్రులు, తోబుట్టువులను ఆప్యాయంగా హత్తులేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వాస సరిగా ఆడక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చారు. వాయువ్య లండన్‌లో నివసిస్తున్న రియా లఖానీ.. కొన్నేళ్లుగా అచలేషియా(అన్నవాహికలో ఇబ్బందులు) బాధ పడుతున్నారు. సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆమె.. నొప్పి తీవ్రతరం కావడంతో ఇటీవల ఆస్పత్రిలో చేరారు. దీంతో రియాకు సర్జరీ చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. (కరోనా: ‘ఆ డ్రగ్‌ తనకు పనిచేయలేదు’)

ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన కొన్ని రోజులకు జ్వరం, గొంతు నొప్పి కారణంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత సర్జరీ సైడ్‌ఎఫెక్ట్స్ గా భావించిన వైద్యులు.. ఆ తర్వాత రియాకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో లండన్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందిన రియా కోలుకున్నారు. ఈ సందర్భంగా బీబీసీతో మాట్లాడుతూ.. చచ్చిబతికానని పేర్కొన్నారు. ‘‘చావు అంచుల దాకా వెళ్లివచ్చాను. బతికి బయటపడ్డాను. జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను’’ అని వ్యాఖ్యానించారు. కరోనా వార్డుల్లో సేవలు అందిస్తున్న సిబ్బంది నిజమైన హీరోలుగా అభివర్ణించారు. కాగా యూకేలో ఇప్పటి వరకు 7 వేల మంది మరణించగా.. దాదాపు 55 వేల మంది మహమ్మారి బారిన పడ్డారు.(కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి)

మరిన్ని వార్తలు