ఇండియన్ రెస్టారెంట్‌ ‘గాంధీ మహల్‌ దగ్ధం’

30 May, 2020 17:33 IST|Sakshi

వాషిం‍గ్టన్‌: కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు నల్లజాతీయులు నిరసనతో కూడా అట్టుడుకుతోంది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్‌ చేసిన పోలీసులు.. చివరికి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. దీనిపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనల్లో భాగంగా మిన్నియాపోలీస్‌లోని ప్రముఖ ఇండియన్‌ రెస్టారెంట్‌ ‘గాంధీ మహల్’‌కు నిరసనకారులు నిప్పు పెట్టారు. హఫ్సా ఇస్లాం కుటుంబం ఈ రెస్టారెంట్‌ను చాలా ఏళ్లుగా సౌత్‌ మిన్నియాపోలిస్‌లో నడుపుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి రెస్టారెంట్‌ యజమాని కుమార్తె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. (విడాకులకు దారి తీసిన జార్జ్ మృతి)

‘రెస్టారెంట్‌ మంటల్లో తగలబడిపోయినందుకు బాధగా ఉంది. అయితే మా నాన్న గారు నాతో ఫోన్‌లో ఈ విషయంపై మాట్లాడారు. రెస్టారెంట్‌ తగులబడితే తగులబడని. కానీ జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలి. ఆ అధికారులను జైళ్లో పెట్టాలి అని అన్నారు. మా రెస్టారెంట్‌ను కాపాడానికి చుట్టుపక్కల వారు చాలా ప్రయత్నించారు. మళ్లీ మేం మా రెస్టారెంట్‌ను తిరిగి నిర్మించుకోగలమనే నమ్మకం ఉంది’ అని ఆమె పోస్ట్‌ చేశారు. హఫ్సా కుటుంబం ఎన్నో ఏళ్లుగా నల్లజాతీయుల నిరసనలకు అండగా నిలబడుతూ వస్తోంది. ఈ విషయంలో కూడా జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలని హఫ్సా కుటుంబం కోరుకుంటుంది.(ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!)

ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్‌ అయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై పోలీసులు మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్‌ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.

మరిన్ని వార్తలు