సెల్ఫీ తీసుకుంటూ భారత విద్యార్థి మృతి

6 Jan, 2019 05:21 IST|Sakshi

లండన్‌: ఐర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మొహెర్‌ కొండ అంచుల్లో సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ జారిపడి భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాధితుడు డబ్లిన్‌లో చదువుకుంటున్న ఓ భారత సంతతి విద్యార్థి అని మాత్రమే తెలిసిందని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ విద్యార్థి ఎత్తైన మొహెర్‌ కొండ అంచులకు చేరుకుని, తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా కాలు జారి పట్టుతప్పి కిందపడిపోయాడు. తోటి పర్యాటకుల హెచ్చరికలతో రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్‌ సాయంతో అతడిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారత్‌లో ఉన్న అతడి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు