ఇండియన్‌ టెకీ దంపతుల దుర్మరణం

30 Oct, 2018 11:19 IST|Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన టెకీ దంపతులు కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్‌ పార్కులోని లోయలో పడి మృతిచెందారు. వివరాలు..దక్షిణ భారత్‌కు చెందిన విష్ణు విశ్వనాథ్‌(29), మీనాక్షి మూర్తి(30) దంపతులు న్యూయార్క్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ట్రెక్కింగ్‌, అడ్వెంచర్‌ ట్రిప్పులకు వెళ్లడమంటే సరదా ఉన్న ఈ జంట గురువారం కాలిఫోర్నియాలోని జాతీయ పార్కుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 800 అడుగుల లోయలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పార్క్‌ అధికారులు వీరి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం.. వీరి మృతదేహాలను కనుగొన్నారు. వీరిని సిస్కో కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్‌ టెకీలుగా గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదన్నారు.

కాగా వీరి మృతిపట్ల కేరళకు చెందిన చెంగునూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థులైన విష్ణు, మీనాక్షి మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. వీరిద్దరు 2006-10 బ్యాచ్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన విద్యార్థులు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో విచారం వ్యక్తం చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ని.. ‘హాలీడేస్‌ అండ్‌ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్‌’ పేరిట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమతో ఙ్ఞాపకాలు పంచుకునే వారని సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.

>
మరిన్ని వార్తలు