థాయ్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి

9 Oct, 2018 04:03 IST|Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి రట్చతేవి జిల్లాలోని సెంట్రా వాటర్‌గేట్‌ పెవిలియన్‌ హోటల్‌ వద్ద రెండు టీనేజ్‌ గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భారత పర్యాటకుడు గాఖ్రేజ్‌ ధీరజ్‌ (42), లావోస్‌ పర్యాటకుడు కెవోంగన్సా (28) ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు భారతీయులు, ఒక లావోస్‌ పౌరుడితో పాటు మరో ఇద్దరు థాయ్‌లాండ్‌ పౌరులున్నారు.

రాత్రి అక్కడున్న భారతీయ రెస్టారెంట్‌మాల్‌లో పర్యాటకులంతా కలసి భోజనం చేశారు. అనంతరం వారంతా తమ బస్సుకోసం ఎదురు చూస్తూ పార్కింగ్‌ ప్రదేశంలో నిలబడ్డారు. పార్కింగ్‌ సమీపంలో ఉన్న స్నూకర్‌ క్లబ్‌ దారిలో అకస్మాత్తుగా రెండు టీనేజ్‌ గ్రూప్‌లు పరిగెత్తుకుంటూ వచ్చాయి. తొలుత వారి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. నిమిషాల వ్యవధిలోనే అది కాల్పులకు దారి తీసింది. దాదాపు 20 మంది టీనేజర్లు తుపాకులు, కత్తులు, కర్రలు పట్టుకుని క్లబ్‌ నుంచి వీధిలోకి పరిగెత్తుకొచ్చారని, అందులో ముగ్గురు కాల్పులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు