‘భారతీయులు మాకు చాలా ముఖ్యం’

5 Mar, 2017 15:34 IST|Sakshi
‘భారతీయులు మాకు చాలా ముఖ్యం’

న్యూయార్క్‌: భారతీయులు తమ పట్టణానికి చాలా ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్‌ గవర్నర్‌ శ్యామ్‌ బ్రౌన్‌ బ్యాక్‌ అన్నారు. వారికి తమ నగరంలోకి అన్ని వేళలా స్వాగతం పలుకుతామని చెప్పారు. ఇటీవల కాన్సాస్‌ నగరంలోని ఆస్ట్రిచ్‌ బారులో తెలుగువారిపై ఓ తెల్లజాతి దురహంకారి కాల్పులు జరపడంతో శ్రీనివాస్‌ కూచిబొట్ల అనే ఇంజినీర్‌ చనిపోగా.. మరో తెలుగువాడు అలోక్‌ మాదసాని గాయపడ్డాడు. వీరిని రక్షించే క్రమంలో అమెరికన్‌ కూడా గాయపడ్డాడు. ట్రంప్‌ తీసుకున్న వలస దారుల వ్యతిరేక నిర్ణయాల అనంతరం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

ఈ నేపథ్యంలో కాన్సాస్‌ గవర్నర్‌ ప్రత్యేకంగా భారతీయ దౌత్యాధికారులు, భారత కమ్యూనిటీకి చెందిన ముఖ్యులతో ప్రత్యేకంగా సమావేశమై భరోసా ఇచ్చారు. ఎన్నో దేశాల నుంచి తమ పట్టణానికి వస్తుంటారని, కానీ, భారతీయులు తమకు చాలా ముఖ్యమైన వారని ఆయన అన్నారు. అలాంటివారిపై జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించబోమని, మొన్న జరిగిన ఘటనకు సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న తాము ఇండియన్స్‌కు అందిస్తామని చెప్పారు.

ఇక భారతీయ కాన్సులేట్‌ తరుపున పనిచేసే కాన్సుల్‌ జనరల్‌ అనుపమ్‌ రాయ్‌ మాట్లాడుతూ గన్‌మేన్‌ నుంచి భారతీయులను కాపాడేందుకు అసమాన ధైర్యం చూపించి తీవ్రంగా గాయపడిన ఇయాన్‌ గ్రిల్లాట్‌ను గురువారం కలుసుకోబోతున్నానని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదన్నారు. మరో వ్యక్తి కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లిన గొప్ప సాహసి అని అన్నారు.


సంబంధిత వార్తా కథనాలకై చదవండి..

రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే

‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’


శ్రీనివాస్‌ మృతిపట్ల యూఎస్‌ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి

అమెరికాలో జాతి విద్వేష కాల్పులు


శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట

మరిన్ని వార్తలు