మరో సునామీ రావచ్చు

28 Dec, 2018 04:40 IST|Sakshi
గురువారం అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి

ఇండోనేసియాలో తాజా హెచ్చరికలు

కార్టియా: ఇండోనేసియాపై మరోసారి సునామీ విరుచుకుపడే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు. గతవారం విస్పోటనం చెందిన ఆనక్‌ క్రకటోవా అగ్ని పర్వతం వద్ద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరో భారీ సునామీకి సంకేతంగా వారు భావిస్తున్నారు. దీని కారణంగానే రెండో తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా అనేక విస్పోటనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు.

ఇప్పటివరకు ఆనక్‌ క్రకటోవా అగ్ని పర్వత ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం(నో గో జోన్‌)గా ఉండగా.. తాజాగా దీనిని ఐదు కిలోమీటర్లకు పెంచారు. గత శనివారం విస్పోటనం ధాటికి భారీగా ఎగిసిన బూడిద, వేడి వాయువులు, ఇతర అగ్ని పర్వత మిశ్రమాలు అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. బూడిద, ఇసుక ఎగిసిపడుతున్న నేపథ్యంలో సిలేగాన్, సెరాంగ్‌ పట్టణ ప్రజలు మాస్కులు, కళ్లద్దాలు ధరించాలని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు