రైల్వేలైన్‌ నిర్మాణం నుంచి భారత్‌ను తప్పించిన ఇరాన్‌ 

15 Jul, 2020 09:36 IST|Sakshi

నిధుల ఆలస్యం వల్లేనని వివరణ

టెహ్రాన్‌: చాబహర్‌ పోర్టు నుంచి జహెదాన్‌ వరకు రైల్వే లైన్‌ ప్రాజెక్టును సొంతంగానే చేపట్టాలని ఇరాన్‌ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నుంచి భారతదేశాన్ని తప్పించింది. భారతదేశం నుంచి నిధుల రాకలో ఆలస్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని నాలుగేళ్ల క్రితం ఇండియా–ఇరాన్‌–అఫ్ఘానిస్తాన్‌మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఇరాన్‌ పక్కన పెట్టింది. ఈ రైల్వే లైన్‌ను 2022 మార్చినెల నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం ‘ఇరానియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’ నుంచి 400 మిలియన్‌ డాలర్లు తీసుకోనున్నారు. అఫ్ఘనిస్తాన్, దక్షిణాసియా దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటులో భాగంగా ఇరాన్‌లో చాబహర్‌ పోర్టు అభివృద్ధికి ఇండియా సహకరిస్తోంది. అలాగే చాబహర్‌ పోర్టు–జహెదాన్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి 1.6 బిలియన్‌ డాలర్లు అందజేస్తామని, నిర్మాణ పనుల్లో సహరిస్తామని ఇండియా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 
(చదవండి: ఇరాన్‌ అలక)

మరిన్ని వార్తలు