బీర్‌ బాటిల్స్‌పై గాంధీ కార్టూన్‌.. తీవ్ర ఆగ్రహం!

2 Jul, 2019 12:37 IST|Sakshi

ఇజ్రాయెల్‌లో బీరు బాటిల్స్‌పై  మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇజ్రాయెల్‌ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ బీర్‌ తయారీ కంపెనీలు మాల్కా బ్రేవరీ, నెగేవ్‌ బీర్స్‌ ఈ చర్యకు పాల్పడ్డాయి. తమ బీర్లకు పబ్లిసిటీ కల్పించేందుకు ఏకంగా వివిధ దేశాల ప్రముఖ వ్యక్తుల ముఖచిత్రాలను బీర్‌ బాటిళ్లపై ముద్రించాయి. ఇందులో భాగంగా టీ షర్ట్‌ వేసుకొని.. కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకున్న మహాత్మాగాంధీ కార్టూన్‌ను బీర్‌ బాటిల్‌పై ముద్రించాయి. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏకంగా బీర్‌ బాటిళ్లపై మహాత్మా గాంధీ కార్టూన్‌ ముద్రించి.. అవమానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఈవిధంగా స్వాతంత్ర్యయోధులను కించపరిచిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహులకు లేఖలు రాశారు.

ఇజ్రాయెల్‌లో పనిచేసే ఓ భారతీయుడు మొదట ఈ బీర్‌ బాటిల్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసి.. తన ఆవేదనను వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత జాతిపిత అయిన గాంధీని అవమానించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితమంతా మద్యం ముట్టనని తన తల్లికి వాగ్దానం చేసి.. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీని ఇలా చేయడం నిజంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 సంవత్సరంలో కూడా అమెరికాకు చెందిన ఒక బీరు కంపెనీ గాంధీని అవమానించేలా ఓ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. దీనిపై భారత ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. 

మరిన్ని వార్తలు