గాజా ఆందోళనల్లో 13 మంది మృతి

31 Mar, 2018 03:08 IST|Sakshi

గాజా సిటీ: ఇజ్రాయెల్‌ సరిహద్దు వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన వేలాది మంది పాలస్తీనా ఆందోళనకారులపై ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసలో 12 వందల మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.

పాలస్తీనా శరణార్థుల్ని దేశంలోకి అనుమతించాలంటూ ఆందోళనకారులు గాజా ప్రాంతంలో సరిహద్దు వెంట శుక్రవారం నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. కొద్దిమంది ఆందోళనకారులు ఫెన్సింగ్‌ వైపుగా దూసుకురావడంతో ఇజ్రాయెల్‌ బలగాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపాయి. డ్రోన్‌ సాయంతో సరిహద్దు వెంట టియర్‌ గ్యాస్‌తో ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు సరిహద్దు వైపుగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారని ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆరోపించింది.   

>
మరిన్ని వార్తలు