ముగింపు కార్యక్రమంలో మెరవనున్న ఇవాంకా
ఉ.కొరియా అధికార పార్టీ ఉపాధ్యక్షుడు కూడా..
వాషింగ్టన్ : వింటర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ఆదివారం ప్యాంగ్చాంగ్లో జరిగే ఈ వేడుకల నిమిత్తం ఇవాంకా సారథ్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలో పర్యటించబోతున్నట్లు శ్వేతసౌధం బుధవారం ప్రకటించింది.
ఉత్తరకొరియా అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా(డబ్ల్యూపీకే) ఉపాధ్యక్షుడు కిమ్ యోంగ్ చోల్ కూడా 8 మంది ప్రతినిధులతో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో ఇవాంకా, కిమ్ యోంగ్ చోల్ ఒకరికొకరు ఎదురుపడే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమైనప్పటి నుంచి మాటల యుద్ధం తగ్గుముఖం పట్టింది.