భారత్‌, చైనా పర్యాటకులకు బ్రెజిల్‌ సదుపాయం

25 Oct, 2019 10:31 IST|Sakshi

బ్రెసీలియా : భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించవచ్చని బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రకటించారు. భారత్‌తో పాటు చైనాకు చెందిన పర్యాటకులు, వ్యాపార నిమిత్తం తమ దేశానికి వచ్చే వారికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా పర్యటన సందర్భంగా బోల్సోనారో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్‌, చైనా కంటే ముందే అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరులకు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ దేశాలేవీ కూడా బ్రెజిల్‌ పౌరులకు మాత్రం ఫ్రీ వీసా ప్రయాణం చేసే అవకాశం కల్పించలేదు.

కాగా సంప్రదాయ ఫాసిస్ట్‌ నాయకుడు జేర్‌ బోల్సొనారో(63) గతేడాది బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. 1964- 85 మధ్య బ్రెజిల్‌లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగా సమర్థించిన బోల్సోనారో.. పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా... ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్‌ అడవిలో కార్చిచ్చు రగిలిన నేపథ్యంలో...  పర్యావరణం కోసం పాటుపడే ఎన్‌జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు