వాషింగ్టన్: అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ గురువారం అమెరికా జాతీయ భద్రతా సలహదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ ఆర్ మెక్ మాస్టర్తో వైట్ హౌస్లో భేటి అయ్యారు. ఈ భేటిలోఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం నిర్మూలన, విద్వేషపూరిత దాడులపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్-అమెరికా భద్రతా సంబంధాలు, రక్షణలో సహకారం తదితర ఒప్పందాలు జరిగాయి.
ఆ తర్వాత వైట్ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్తో కూడా జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల అమెరికాలో చనిపోయిన భారత పౌరుడు శ్రీనివాస్ కూచిభోట్లకు నివాళులు అర్పించారు. ఇరు దేశాల ఆర్ధిక వ్యవహారాలు, రక్షణ సహకారాలపై చర్చించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఇరుదేశాల బంధాలకు మూలాలని ర్యాన్ భేటి అనంతరం తెలిపారు. కొత్త అమెరికా ప్రభుత్వంలోని అధికారులను జయశంకర్ వరుసగా కలుస్తున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహాపూర్వక వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది.