అలిసన్‌, హొంజొలకు మెడిసిన్‌లో నోబెల్‌

1 Oct, 2018 16:47 IST|Sakshi

న్యూయార్క్‌ : జపాన్‌కు చెందిన తసుకు హొంజొ, అమెరికన్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ అలిసన్‌లకు మెడిసిన్‌లో 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్‌ ప్రైజ్‌ లభించింది. క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు గాను వీరికి అత్యున్నత పురస్కారం దక్కిందని నోబెల్‌ కమిటి పేర్కొంది. క్యాన్సర్‌ కణాలను నిరోధించేలా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడంపై వీరు సాగించిన పరిశోధన క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మైలురాయి వంటిదని, వీరు ప్రతిపాదించిన ఇమ్యూన్‌ చెక్‌పాయింట్‌ సిద్ధాంతం క్యాన్సర్‌ చికిత్సలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కమిటీ వ్యాఖ్యానించింది.

క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కోగలమనే మన దృక్కోణాన్ని సైతం వీరి పరిశోధన సమూలంగా మార్చివేసిందని పేర్కొంది.యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన ఎండీ అండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌ అయిన అలిసన్‌ సాగించిన పరిశోధనా ఫలితాలు దీటైన క్యాన్సర్‌ చికిత్సకు మార్గం సుగమం చేశాయని నోబెల్‌ కమిటీ తెలిపింది. ఇక జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హొంజొ చేపట్టిన పరిశోధనలు సైతం సమర్ధవంతమైన క్యాన్సర్‌ చికిత్సకు ఊతమిచ్చాయని పేర్కొంది. హొంజొ 34 సంవత్సరాలుగా క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

మరిన్ని వార్తలు