బుల్లెట్‌ రైలు పక్కన పట్టాలపై కూర్చోండి!

28 Aug, 2018 17:02 IST|Sakshi

ఉద్యోగులకు జపాన్‌ కంపెనీ వినూత్న శిక్షణ

మండిపడుతున్న నిర్వహణ సిబ్బంది

టోక్యో: జపాన్‌కు చెందిన బుల్లెట్‌ రైలు కంపెనీ షింకన్‌సేన్‌ వినూత్నమైన శిక్షణ విధానాన్ని అమలుచేస్తోంది. బుల్లెట్‌ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే.. అవి వెళుతున్న మార్గంలోని టన్నెల్స్‌లో పట్టాల పక్కన ఉద్యోగుల్ని కూర్చోబెడుతోంది. రైళ్ల నిర్వహణ, భద్రత విభాగంలో పనిచేస్తున్న 190 మంది ఉద్యోగులకు కంపెనీ ప్రస్తుతం ఈ తరహా శిక్షణ ఇస్తోంది. వేగంగా వెళ్లే బుల్లెట్‌ రైలు పక్కనే తమను కూర్చోబెట్టడంపై పలువురు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంపెనీ వెనక్కు తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో షింకన్‌సేన్‌ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘మా నిర్వహణ సిబ్బందికి వారి విధుల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజెప్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా భద్రతాపరమైన అంశాలకు మేం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ శిక్షణపై కంపెనీ వెనక్కు తగ్గబోదు. 2015లో ఓ ప్రమాదం కారణంగా బుల్లెట్‌ రైలు బయటిభాగం ఊడిపోవడంతో వెస్ట్‌ జపాన్‌ రైల్వే కంపెనీ ఈ శిక్షణను ప్రారంభించింద’ని తెలిపారు. షింకన్‌సేన్‌ సంస్థ తయారుచేసిన రైళ్ల కారణంగా గత 50 ఏళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ప్రస్తుతం భారత్‌లోని ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ఈ కంపెనీయే చేపడుతోంది.

మరిన్ని వార్తలు