జపాన్... పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడి. అంతటి భయంకర దాడికి దేశం చిన్నాభిన్నమైనప్పటికీ... జపనీయులు ఎంతో మనోధైర్యంతో తమ దేశాన్ని మళ్లీ నిలబెట్టుకున్నారు. తమ జీవనశైలితో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంతో నిబద్ధతో పనిచేసే జపనీయులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ... తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు... అక్కడి ప్రభుత్వం రొటీన్కు భిన్నంగా కొత్త కొత్త నిబంధనలు రూపొందించి మరీ క్రమశిక్షణలో పెడుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతంగా ఆ దేశ పౌరులు ఏంచేస్తున్నారో మనమూ ఓసారి తెలుసుకుందాం...
టోక్యో: జపాన్లోని ఓ ఆఫీస్.. డ్యూటీ షిప్ట్ ముగిసిపోయే సమయం సాయంత్రం 5 గంటలకు సరిగ్గా ఓ అలారం మోగుతుంది. ఉద్యోగులు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని అనౌన్స్మెంట్ వస్తుంది. కాసేపయ్యాక.. ఓ డ్రోన్ ఆఫీస్ మొత్తం తిరుగుతుంది. ఎక్కడైనా ఉద్యోగులు కనిపిస్తే.. వెంటనే పై అధికారులకు సమాచారం ఇస్తుంది. వాళ్లు సదరు ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. వెంటనే పని ఆపేసి వెళ్లకపోతే మెమో జారీ చేస్తామని హెచ్చరిస్తారు. విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. జపాన్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో, చాలా కంపెనీల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవును..జపాన్ ఉద్యోగులు చేయాల్సిన పనిగంటలకంటే ఎక్కువ గంటలు పని చేయడమేగాక... తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక..ఉద్యోగులు ఏదైనా నిరసన తెలపాలన్నా ఎక్కువసేపు పనిచేసి నిరసన తెలుపుతున్నారు. ఇదంతా తలనొప్పిగా మారడంతో.. పనిరాక్షసులపై ప్రభుత్వానికి కఠిన నిబంధనలు అమలు చేయక తప్పడంలేదు.
కరోషి..
ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరిగి గుండెపోటు, అవయవాల ఫెయిల్యూర్ వంటివి సంభవిస్తున్నాయి. దీనిని జపాన్ భాషలో కరోషి అని పిలుస్తుంటారు. ఎన్హెచ్కే వార్తా సంస్థలో పనిచేసే ఓ మహిళా రిపోర్టర్ మివా సాడో.. వయసు 31 సంవత్సరాలు మాత్రమే. 2013 జులైలో ఆమె గుండెపోటుతో మరణించారు. పోస్ట్మార్టం రిపోర్టులో కరోషి వ్యాధితో చనిపోయినట్టు తేలింది. ఎన్నికల సమయం కావడంతో ఆమె 159 గంటలపాటు అదనంగా పనిచేసినట్టు తేలింది. నెలలో రెండు రోజులు మాత్రమే వీక్ ఆఫ్ తీసుకున్నారట. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది. ఇది ఒక్కటేగాక.. ఇలా జపాన్లో చాలామంది కరోషి వ్యాధితో మరణిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. ఇలాంటి మరణాలను మొదట 1978లో అధికారికంగా గుర్తించి కరోషి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆఫీస్లోనే చనిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. వాళ్ల పని సంస్కృతి, ఎక్కువ మొత్తంలో అందే జీతాలు. అంతేగాక ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి సైతం రూ.లక్షల్లో జీతాలు అందుతాయి.
ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు..
చట్టపరంగా...
(సాక్షి, స్టూడెంట్ ఎడిషన్)