-

జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం

9 Jan, 2020 16:25 IST|Sakshi

సోషల్‌ మీడియా ప్రయోగం ద్వారా మరోసారి వార్తల్లో యుసాకు మేజావా

ట్విటర్‌లో ఫాలో అయినందుకు కోట్లు దానం

వెయ్యిమందికి  రూ.64.36 కోట్లు పంచిపెట్టాడు

టోక్యో : జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్‌ ఇండస్ట్రీ దిగ్గజం యుసాకు మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా రూ. 64.36 కోట్లు పంచిపెట్టడం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం  కలుగుతుంది.  సోషల్‌ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన  తన ట్విటర్‌లో అనుచరులు వెయ్యిమందికి ఈ నగదును పంచిపెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా జనవరి 1వ తేదీన ట్విటర్‌లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యిమంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి  9 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ .64.36 కోట్లు) అందజేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్‌ లో రెండవ అతిపెద్ద షాపింగ్‌ సంస్థ జోజో ఇంక్‌ వ్యవస్థాపకుడైన  యుసాకు  చేసిన ఈ ట్వీట్‌  రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల  షేర్లను సాధించింది.  9 లక్షలకుపై పైగా లైక్‌లు కొట్టేసింది. అంతేకాదు జనవరి 7 నాటికి అత్యధిక సార్లు రీట్వీట్‌ అయిన ట్వీట్‌గా నిలిచింది. 

యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (బీఐ) భావనను నిశితంగా అర్థం చేసుకోవడంలో భాగమే ఈ ప్రయత్నమని యుసాకు మేజావా ట్విటర్‌లో వివరించారు. తాను పెద్ద రాజకీయ నాయకుడిని కానందున ప్రజల కనీసం ఆదాయంపై ఇంతకుమించి తానేమీ చేయలేనని వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చారు. అంతేకాదు జపాన్‌ ప్రభుత్వం, కనీస ఆదాయ పథకాన్ని...అంటే ప్రతి నెలా పౌరులకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే ఒక విధానం ప్రవేశ పెట్టవలసిన అవసరాన్ని వివరించారు. మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ఇ లాంటి పథకాన్ని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తాను ఎన్నికైతే 18 ఏళ్లలోపు ప్రతి వయోజన అమెరికన్‌కు నెలకు వెయ్యి డాలర్లు ఇస్తానని వాగ్దానం చేశారనీ, ఆయననే యుసాకా ఫాలో అయ్యారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా  మేజావా ఇటీవల 2023లో ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చంద్రయానానికి సంతకం చేసిన మొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 


టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తో యుసాకు (ఫైల్‌ ఫోటో)

మరిన్ని వార్తలు