జర్నలిస్టు స్వాతికి ప్రెస్‌ ఫ్రీడమ్‌ అవార్డు

10 Nov, 2018 03:46 IST|Sakshi
జర్నలిస్ట్‌ స్వాతి చతుర్వేది

ఆన్‌లైన్‌లో బీజేపీ వేధింపులపై చూపిన తెగువకు గుర్తింపు

లండన్‌: ప్రతిష్టాత్మక లండన్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ అవార్డు ఫర్‌ కరేజ్‌–2018 భారత్‌కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ స్వాతి చతుర్వేదిని వరించింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఆన్‌లైన్‌లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు. ఇటలీ, టర్కీ, మొరాకోకు చెందిన జర్నలిస్టులను అధిగమించి ప్రియాంక ఈ అవార్డును గెలుచుకున్నారు. ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగానే కాకుండా ఆమె ’ఐ యామ్‌ ఏ ట్రోల్‌: ఇన్‌సైడ్‌ ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ది బీజేపీ డిజిటల్‌ ఆర్మీ’ అనే పుస్తకాన్ని రచించారు. గురువారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్‌ విత్‌ అవుట్‌ బోర్డర్స్‌(ఆర్‌డబ్ల్యూబీ) అనే సంస్థ అవార్డును స్వాతికి ప్రదానం చేసింది.

స్వాతి మాట్లాడుతూ ‘ సమర్థంగా చేసిన నా పనికి కాకుండా నా ధైర్యానికి ఈ అవార్డు పొందడం కొంత విచారకరం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియాను శత్రువుగా చిత్రీకరిస్తున్నారు. భారత్‌లో గతేడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ తన ఇంటి బయటే హత్యకు గురవడం భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. విమర్శల పట్ల ప్రభుత్వాలు సహనం పాటించడంలేదు. ఆన్‌లైన్‌లో నాకు ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. అవి నాపై ప్రభావం చూపి ఉంటే విధుల్ని సరిగా నిర్వర్తించేదాన్నే కాదు. దాడులు, ప్రాణ హాని ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కోసం ఆర్‌డబ్ల్యూబీ పాటుపడటం ధైర్యాన్నిస్తోంది’ అని అన్నారు.
స్వాతి చతుర్వేది

మరిన్ని వార్తలు