ఆ జడ్జీలు మధ్యవర్తిత్వం చేశారు

29 Nov, 2017 01:18 IST|Sakshi

జాబితాలో 13 మంది మాజీ, ఏడుగురు ప్రస్తుత న్యాయమూర్తులు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పనిచేసిన 13 మంది మాజీ జడ్జీలు, ఏడుగురు ప్రస్తుత జడ్జీలు వారి పదవీకాలంలో వివిధ వ్యాజ్యాల్లో మధ్యవర్తులుగా పనిచేశారని ఓ నివేదిక ఆరోపించింది. వారిలో బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్‌ గ్రీన్‌వుడ్‌ ఉన్నారు. ఐసీజేలో జడ్జీగా భారత్‌ నుంచి ఎన్నికైన ధల్వీర్‌ భండారీ మధ్యవర్తిత్వం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కెనడాకు చెందిన అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సంస్థ (ఐఎస్‌ఎస్‌డీ) నివేదించింది.

ఐరాస సాధారణ సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో ధల్వీర్‌ భండారీ గెలుపొందగా, గ్రీన్‌వుడ్‌ మాత్రం వెనకే ఉండిపోయారు. బ్రిటన్‌కు చెందిన గ్రీన్‌వుడ్‌ తన పదవీ కాలంలో  తొమ్మిది పెట్టుబడుల వివాదాల్లో మధ్యవర్తిగా పనిచేశారని నివేదిక పేర్కొం ది. రెండు కేసులకు ఆయన దాదాపు 4 లక్షల డాలర్లు తీసుకున్నట్లు తేలింది. అలాంటి 90 కేసుల్లో కేవలం 9 కేసులకు గాను జడ్జీలకు మొత్తం 10 లక్షల డాలర్లు ముట్టినట్లు ఐఎస్‌ఎస్‌డీ వెల్లడించింది. ప్రస్తుత ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం, ఐదుగురు మాజీ అధ్యక్షులు కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు