చికిత్స పొందుతూ దుబాయ్‌లో మృతి చెందిన కేరళ వ్యక్తి

17 Feb, 2020 14:19 IST|Sakshi

దుబాయ్‌ : అగ్ని ప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత్‌కు చెందిన వ్యక్తి సోమవారం మృతి  చెందారు. కేరళకు చెందిన అనిల్‌(32) మంటల్లో చిక్కుకున్న తన భార్య నీనును రక్షించే క్రమంలో వీరిద్దరూ గత సోమవారం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికులు ఈ దంపతులను దుబాయ్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించగా 90 శాతం కాలిన గాయలతో చికిత్స పొందుతున్న అనిల్‌ నేడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 శాతం గాయాలైన ఆయన భార్య నీను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని.. ఈ ఘటనలో బాలుడు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. 

దుబాయ్‌లోని ఉమ్‌ అల్‌ క్విన్‌లో అనిల్‌ తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత సోమవారం వారి అపార్టుమెంటులోని కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటల్లో చిక్కుకున్న నీనును కాపాడేందుకు వెళ్లిన అనిల్‌ భార్యను రక్షించేందుకు వెళ్లి తాను మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో నీను అరుపులు విన్న పక్క అపార్టుమెంటు వాసులు అక్కడి వచ్చి చూసేసరికి అనిల్ మంటల్లో చిక్కుకుని కనిపించారు. మంటలను ఆర్పి దంపతులిద్దరినీ అబుదాబిలోని మఫ్రాక్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు చికిత్స అందిస్తున్న తరుణంలో నీను పరిస్థితి నిలకడ ఉండగా. బాలుడి మెరుగైన వైద్యం కోసం అబుదాబిలోని మరో ఆసుపత్రికి గత మంగళవారం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

భార్యను కాపాడుతూ మంటల్లో చిక్కుకున్న భర్త..

మరిన్ని వార్తలు