ఖషోగ్గి హత్య కేసు.. సౌదీ కాన్సులేట్‌ వర్కర్‌ సాక్ష్యం

4 Jul, 2020 11:20 IST|Sakshi

ఇస్తాంబుల్‌: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపడమే కాక సౌదీ అరేబియా పాలకుడి ప్రతిష్టను దెబ్బ తీసిన ప్రముఖ జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గి హత్య కేసును టర్కీ కోర్టు శుక్రవారం విచారించింది. ఈ నేపథ్యంలో సౌదీ కాన్సులేట్‌ వర్కర్‌ ఒకరు సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో 20మంది సౌదీ అధికారులు గైర్హాజరు కావడంతో.. టెక్నికల్‌ నిపుణుడు జెకి డెమిర్‌ సాక్ష్యం కీలకంగా మారింది. ‘ఖషోగ్గి తన పత్రాల కోసం కాన్సులేట్‌కి వచ్చాడు. అప్పుడు అక్కడ ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. ఖషోగ్గి అక్కడికి వచ్చిన కాసేపటికి వారు నన్ను పిలిచి ఒక ఓవేన్‌ని వెలిగించమని చెప్పారు. వారంతా భయాందోళనలకు గురవుతున్నట్లు కనిపించారు. ఆ తర్వాత కాన్సులేట్‌ గార్డెన్‌లో ఓవేన్‌ని పడేశారు. దాని‌ చుట్టూ చిన్న చిన్న మాంసం ముక్కలు ఉన్నాయి.. ఆ తర్వాత ఓవెన్‌ చుట్టు ఉన్న పాలరాయిని రసాయనాలతో శుభ్రం చేశారనుకుంటా. అందువల్ల అది రంగు మారినట్లు కనిపించింది’ అని డెమిర్‌ కోర్టుకు తెలిపాడు. స్థానిక రెస్టారెంట్ నుండి ముడి కబాబ్‌లను తీసుకురావాలని తనను  కాన్సుల్ ఆదేశించినట్లు కాన్సుల్ డ్రైవర్ అంతకుముందు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. (ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష)

ఖషోగ్గిని ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత హంతకులు అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చి వేయాలని భావించినట్లు టర్కీ పోలీసులు ఆరోపించారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి  హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్‌ పేపర్స్‌ కోసం కాన్సులేట్‌ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండ పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా)

ఈ కేసులో ఇద్దరు సౌదీ ఉన్నతాధికారులు మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరి, మాజీ రాయల్ కోర్ట్ సలహాదారు సౌద్ అల్-కహ్తాని మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు ముందస్తు పథకం ప్రకారమే ఖషోగ్గిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే రియాద్ కోర్టు వీటిని తోసి పుచ్చింది. అంతేకాక తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా అసిరిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో సౌదీ అరేబియా కోర్టు అయిదుగురికి మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు