మరోసారి ట్రంప్‌–కిమ్‌ భేటీ!

8 Oct, 2018 09:38 IST|Sakshi

సియోల్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య మరో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉత్తర కొరియాలో ప్రస్తుతం పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈ విషయమై పురోగతి సాధించారు. ప్యాంగ్‌యాంగ్‌లో ఆదివారం కిమ్‌తో రెండు గంటల పాటు సమావేశమైన పాంపియో.. అణు నిరాయుధీకరణతో పాటు అమెరికా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వీలైనంత త్వరగా ట్రంప్‌తో మరోసారి సమావేశం అయ్యేందుకు కిమ్‌ ఈ భేటీలో అంగీకరించారు.

కిమ్‌తో భేటీ అనంతరం దక్షిణకొరియా చేరుకున్న పాంపియో అధ్యక్షుడు మూన్‌–జే–ఇన్‌ను కలుసుకున్నారు. ట్రంప్‌–కిమ్‌ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి స్థలం, తేదీ ఖరారు కాలేదని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఉత్తర కొరియా, అమెరికాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే దిశలో ఆదివారం చర్చలు సాగాయని కిమ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సింగపూర్‌లో ట్రంప్‌–కిమ్‌ తొలిసారిగా సమావేశమైన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు