ఉత్తర కొరియా నియంతకు ఘన స్వాగతం

10 Jun, 2018 17:23 IST|Sakshi

సింగపూర్ ‌: ప్రపంచం దృష్టంతా ఇప్పుడు సింగపూర్‌పైనే కేంద్రీకృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కీలక భేటీనే అందుకు కారణం. ఈ 12న సమావేశం నేపథ్యంలో ట్రంప్‌తో సమావేశం కోసం కిమ్‌ సింగపూర్‌ చేరుకున్నారు. ఎయిర్‌ చైనా విమానంలో నార్త్‌ కొరియా నియంత కిమ్ సింగపూర్‌ చేరుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం కిమ్‌తో భేటీ కోసం సింగపూర్‌ బయలుదేరినట్లు అమెరికా అధికార వర్గాల సమాచారం.

ఆదివారం ఉదయం ఎయిర్‌ చైనా విమానంలో ప్యాంగ్‌యాంగ్‌ నుంచి బయలుదేరిన కిమ్‌ జాంగ్ ఉన్.. సింగపూర్‌ చేరుకోగా అక్కడ ఘనస్వాగతం లభించింది. ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో తమ దేశానికి విచ్చేసిన ఉత్తర కొరియా అధినేతకు స్థానిక ఛాంగీ ఎయిర్‌పోర్టులో సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియాన్‌ బాలకృష్ణన్‌ ఘన స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య హోటల్‌కు చేరుకున్న కిమ్‌ను సింగపూర్‌ అధ్యక్షుడు లీ హీన్‌ లూంగ్‌ కలుసుకున్నారు. అనంతరం లీ హీన్‌ లూంగ్‌, కిమ్‌లు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. మరోవైపు కిమ్‌ బస చేసిన హోటల్‌ వద్ద భద్రతను సింగపూర్‌ అధికారులు కట్టుదిట్టం చేశారు. సెంటోసా ద్వీపంలో కిమ్‌, ట్రంప్‌ భేటీ కానున్న విషయం తెలిసిందే.     

>
మరిన్ని వార్తలు