కిమ్‌ చరిత్రాత్మక కరచాలనం

27 Apr, 2018 09:07 IST|Sakshi
దక్షిణ కొరియా అధ్యక్షుడితో కరచాలనం చేస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌

పాన్‌మున్‌జోమ్‌ : ముఖంపై చిరునవ్వుతో కరచాలనం చేస్తూ శత్రు దేశాధినేతను ఆత్మీయంగా పలకరించారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. శుక్రవారం ఇరుదేశాల మధ్య గల శాంతి గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో కిమ్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ను కలుసుకున్నారు.

అంతకుముందు ఇరు దేశాల సరిహద్దుల్లో నేతలు నిల్చున్నారు. మూన్‌ను ఉత్తరకొరియాలోకి రావాలంటూ కిమ్‌ ఆహ్వానించారు. అనంతరం మూన్‌తో కలసి కిమ్‌ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. 1953-54ల మధ్య కొరియా యుద్ధం అనంతరం ఓ ఉత్తరకొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

పాన్‌మున్‌జోమ్‌లో కలయికకు గుర్తుగా ఇరువురు దేశాధ్యక్షులు ఓ మొక్కను కూడా నాటనున్నారు. 1953-54ల మధ్య యుద్ధం శాంతియుత ఒప్పందంతో ముగియలేదు. అందుకే ప్రత్యక్ష యుద్ధం జరగకపోయినా ఇరుదేశాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. పాన్‌మున్‌జోమ్‌ సమావేశంలో ఈ సమస్యపై కిమ్‌, మూన్‌లు చర్చిస్తారని భావిస్తున్నారు.

కాగా, కొద్దిరోజుల క్రితం ఉత్తర కొరియా అణు పరీక్షల వేదికను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు