బీజింగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ సోమవారం చైనాలో అకస్మాత్తుగా ప్రత్యక్షమ య్యారు. ఈశాన్య ప్రాంత తీర నగరం దాలియాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆయన అనధికారిక సమావేశం జరిపారు. ఇరువురు నేతలు సముద్ర తీరం వెంట నడుస్తూ మాట్లాడుకుంటున్న దృశ్యాలను చైనా అధికార సీసీటీవీ ప్రసారం చేసింది.
సోమవారం, మంగళవారాల్లో ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయని అధికార వార్తా సంస్థ జిన్హువా ధ్రువీకరించింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ నేపథ్యంలో కిమ్ హఠాత్తుగా చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మూడు నెలల్లో కిమ్ చైనాలో పర్యటించటం ఇది రెండోసారి. ట్రంప్, కిమ్ల శిఖరాగ్ర సమావేశం వచ్చే నెలలో సింగపూర్ వేదికగా జరిగే అవకాశాలున్నాయని దక్షిణకొరియా మీడియా తెలిపింది.