ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

22 May, 2019 08:22 IST|Sakshi

దుబాయ్‌: ముస్లింల ప్రధాన పండుగల్లో రంజాన్‌ ఒకటి. ఈ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే విందునే ఇఫ్తార్‌గా పిలుస్తారు. తాజాగా ఈ ఇఫ్తార్‌ విందుతో భారత్‌కు చెందిన ఓ సేవా సంస్థ గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్‌ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్‌ పొడవున ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసింది. 

ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విందు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ‘గల్ఫ్‌ న్యూస్‌’ తెలిపింది. ఈ సందర్భంగా చారిటీ వ్యవస్థాపకులు జోగిందర్‌ సింగ్‌ సలారియా మాట్లాడుతూ... ‘శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని తీసుకోవడం వల్ల జంతు వధను అరికట్టవచ్చు. ఈ రికార్డు సాధించడంలో సాయపడిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.

మరిన్ని వార్తలు