ఈ ఘనత ఆ విమానానిదే..

21 Oct, 2019 08:19 IST|Sakshi

సిడ్నీ : ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. న్యూయార్క్‌ నుంచి సిడ్నీకి 19 గంటల ప్రయాణం అనంతరం సుదూర తీరానికి చేరుకున్న తొలి నాన్‌స్టాప్‌ ప్యాసింజర్‌ ఫ్లైట్‌గా ఖంటాస్‌ క్యూఎఫ్‌7879 అరుదైన ఘనత సాధించింది. న్యూయార్క్‌ నుంచి సిడ్నీకి 19 గంటల 16 నిమిషాల ప్రయాణం అనంతరం ఈ నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ ఆదివారం సిడ్నీలో ల్యాండ్‌ అయింది. లండన్‌ నుంచి సిడ్నీకి సైతం నాన్‌స్టాప్‌ డైరెక్ట్‌ ఫ్లైట్‌పై ఖంటాస్‌ టెస్ట్‌ రన్‌ నిర్వహిస్తోంది. అమెరికా, బ్రిటన్‌ నుంచి ఆస్ర్టేలియాకు ఈ విమానయాన సంస్థ మారథాన్‌ రూట్లలో రెగ్యులర్‌ విమాన సేవలు అందించేందుకు సన్నద్ధమైంది.

కేవలం 49 మంది మందితో బోయింగ్‌ 787-9 విమానం ఇంధనం తిరిగి నింపుకునే అవసరం లేకుండా 16,000 కిలోమీటర్లుపైగా ప్రయాణించి న్యూయార్క్‌ నుంచి సిడ్నీకి చేరుకుంది. ఇది తమ విమానయాన సంస్థతో పాటు ప్రపంచ విమానయాన రంగంలోనూ చారిత్రక ఘట్టమని ఖంటాస్‌ సీఈవో అలన్‌ జోస్‌ అభివర్ణించారు. భిన్న టైమ్‌జోన్స్‌ను దాటి ప్రయాణీకులు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ప్రయాణీకులు, విమాన సిబ్బందిపై జెట్‌ల్యాగ్‌ ప్రభావానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖంటాస్‌ రెండు ఆస్ర్టేలియన్‌ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకుంది. ఖంటాస్‌ గత ఏడాది ఆస్ర్టేలియాలోని పెర్త్‌ నుంచి లండన్‌కు తొలి డైరెక్ట్‌ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టగా 17 గంటల ప్రయాణంతో కూడిన ఈ విమానమే ప్రపంచంలోనే లాంగెస్ట్‌ పాసింజర్‌ విమానంగా నమోదైంది.

మరిన్ని వార్తలు