కరేబియన్‌ దీవుల్లో భారీ భూకంపం

29 Jan, 2020 09:26 IST|Sakshi

హవానా: కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది. జమైకా, క్యూబాలను కూడా భూ ప్రకంపనలు తాకాయి. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

జార్జ్ టౌన్‌లోని కేమాన్ దీవులలో 0.4 అడుగుల సునామీ నమోదైంది. కానీ డొమినికన్ రిపబ్లిక్‌లోని పోర్ట్ రాయల్, జమైకా లేదా ప్యూర్టో ప్లాటా దగ్గర సునామీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా 6.1 తీవత్రతో సంభవించిన భూకంపం నుంచి పెద్దగా సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, దీవులతోపాటు బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది. గ్రాండ్ కేమన్‌లోని ఓగియర్‌లో నివసించే అలెక్ పుల్టర్ మాట్లాడుతూ ఇది తాను చూసిన మొట్టమొదటి భూకంపం కాదని, అయితే ఇది ఇప్పటివరకు అతిపెద్ద భూకంపం అని తెలిపారు.

మరిన్ని వార్తలు