‘జకీర్‌ను అప్పగించే ప్రసక్తే లేదు’

6 Jul, 2018 15:13 IST|Sakshi
జకీర్‌ నాయక్‌

పుత్రజయ, మలేషియా : వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ అప్పగింత విషయంలో భారత్‌కు మలేషియా షాకిచ్చింది. జకీర్‌ను భారత్‌కు అప్పగించే ప్రసక్తే లేదని మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ శుక్రవారం స్పష్టం​ చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జకీర్‌ మలేషియాలో శాశ్వత నివాస హోదా కలిగి ఉన్నారు. ఆయన వల్ల మాకు సమస్యలు రానంత వరకు దేశం విడిచి వెళ్లాలంటూ ఒత్తిడి చేయలేమని’ మహతీర్‌ వ్యాఖ్యానించారు.

కాగా మలేషియాలో నివాసముంటున్న జకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ మలేషియా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పందంలో భాగంగా గత జనవరిలో భారత్‌ చేసిన అభ్యర్థనకు మలేషియా సానుకూలంగా స్పందిస్తుందంటూ విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధానే స్వయంగా ఈ విషయమై స్పష్టతన్విడం గమనార్హం.

అవన్నీ అవాస్తవాలు..
ఆర్థిక ఉల్లంఘనలతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్నారని జకీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజులుగా.. జకీర్‌ భారత్‌కు తిరిగి వస్తున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ‘భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగినప్పుడే భారత్‌కు తిరిగి వస్తాను. అంతవరకు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేరంటూ’ జకీర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు