మాల్యా కేసులో సీబీఐ ముందడుగు

28 Apr, 2018 02:11 IST|Sakshi

లండన్‌: లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు వ్యతిరేకంగా సీబీఐ అధికారులు సమర్పించిన అనేక ఆధారాలను లండన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో మాల్యాను భారత్‌ను రప్పించేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించినట్లయింది. మాల్యాను భారత్‌కు రప్పించే కేసు విచారణ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతున్న విషయం తెలిసిందే.

శుక్రవారం విచారణకు మాల్యా కోర్టుకు హాజరయ్యారు. భారత్‌ తరఫున వాదిస్తున్న క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(సీపీఎస్‌) సమర్పించిన ఆధారాలపై స్పందించేందుకు మరింత సమయమివ్వాలని మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా.. జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌ తరఫున అందచేసిన అదనపు సమాచారం సహాయకరంగా ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 11కు విచారణ వాయిదాపడింది. 

మరిన్ని వార్తలు