మినీ లైఫ్‌ ఆఫ్‌ పై

4 Aug, 2018 10:23 IST|Sakshi

మాస్కో: అడుగుల ఎత్తున్న ఎగిసి పడ్డ అలలు.. దారి తప్పిన ఒంటరి నావ.. అందులో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలతో గడిపిన వ్యక్తి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. సరదాగా నదీ విహారానికి వెళ్లిన వ్యక్తి తప్పిపోయి సముద్రం గుండా మరో ఖండాంతరానికి చేరుకున్నాడు. అలస్కా యాంకరేజ్‌కు చెందిన జాన్‌ మార్టిన్‌ విలియమ్‌-3.. అనే వ‍్యక్తి రెండు వారాల క్రితం క్రితం యుకోన్‌ నదీ తీరంలో విహారానికి వెళ్లాడు. వ్యక్తిగత బోట్‌లో విహారం చేస్తుండగా.. అలా బేరింగ్‌ సముద్రంలోకి చేరుకున్నాడు. అక్కడ అలల తాకిడికి తప్పిపోగా.. బేరింగ్‌ సముద్రం గుండా 50 మైళ్లు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకున్నాడు.

ఆగష్టు 1న చుకోట్కా రీజియన్‌లోని లావ్రెంటియా గ్రామానికి(రష్యా) చేరకున్న అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వాతావరణంలో మార్పులు, నేవీగేషన్‌ వ్యవస్థను కోల్పోవటంతో అతను దారితప్పిపోయినట్లు తెలుస్తోంది. అతని నుంచి వివరాలు సేకరించిన అనంతరం అమెరికా దౌత్య అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాలను రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జోఖరోవా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆ రెండు వారాలు ఉప్పు నీటిని వేడి చేసుకుని తాగటం, చేపలతో ఆకలి తీర్చుకున్నట్లు మార్టిన్‌ వెల్లడించాడు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, త్వరలోనే స్వస్థలానికి పంపిస్తామని మరియా జోఖరోవా వెల్లడించారు. 

మరిన్ని వార్తలు