విషాదం : ఉంగరంతో తన భర్తను గుర్తుపట్టింది

9 Nov, 2019 08:57 IST|Sakshi

లండన్‌ : హిందూ మహాసముద్రంలోని ఓ దీవికి విహారయాత్రకని వెళ్లిన దంపతులకు విషాదమే మిగిలింది. ఈతకు వెళ్లిన వ్యక్తిని ఏకంగా ఒక సొరచాప మింగేసింది. వివరాల్లోకి వెళితే.. ఎడిన్‌బర్గ్‌కు చెందిన రిచర్డ్‌ మార్టిన్‌ టర్నర్‌ అనే వ్యక్తి ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. తన భార్య 40వ పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకోవాలని నవంబర్‌ 2న హిందూ మహాసముద్రంలోని రీ యూనియన్‌ దీవికి వచ్చారు.అయితే అక్కడి నుంచి లాగూన్‌ బీచ్‌ ప్రాంతానికి వెళ్లిన రిచర్డ్‌ 6 అడుగుల లోతు ఉన్న సముద్రంలోకి ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అప్రమత్తమై భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

దీంతో అధికారులు పడవలు, హెలికాప్టర్‌, గజ ఈతగాళ్లను రప్పించి దీవి మొత్తం వెతికించినా ఎలాంటి ఫలితం రాలేదు. అయితే లాగూన్‌ బీచ్‌లో షార్క్‌ చేపలు తిరుగుతున్నాయని తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లను అక్కడికి పంపించి నాలుగు షార్క్‌ చేపలను బంధించారు. వాటిని చంపి షార్క్‌ అవశేషాలను పరిశీలించగా ఒక షార్క్‌ కడుపులో చేయితో పాటు ఉంగరం కూడా దొరికింది. ఆ ఉంగరాన్ని పరిశీలించిన రిచర్డ్‌ భార్య అది తన భర్తదేనని తెలిపారు. అలాగే అధికారులు చేయిని, ఇతర అవశేషాలను డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపిచంగా అది రిచర్డ్‌దేనని స్పష్టం చేశారు. అయితే రిచర్డ్‌ను మింగిన షార్క్‌ 13 అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు