అది కనపడలేదు.. ముఖం పచ్చడైంది!

12 Mar, 2020 09:50 IST|Sakshi
వీడియోలో రికార్డయిన దృశ్యాలు

స్కాట్‌లాండ్‌ : ఇన్‌విజిబుల్‌ ఛైన్‌ కారణంగా ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కిందపడి ముఖం పచ్చడి చేసుకున్నాడు. ఈ సంఘటన స్కాట్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్కాట్‌లాండ్‌ డునూన్‌కు చెందిన జేమీ రే అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పెర్రీ టెర్మినల్‌  దగ్గర పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ ఓ జీబ్రా క్రాసింగ్‌ దగ్గరకు వచ్చాడు. అంతే ఒక్కసారిగా ఏదో తొడలకు అడ్డం తగిలినట్టు బొక్కబోర్లా పడ్డాడు. ముఖం నేరుగా నేలకు తాకింది, అనంతరం శరీరం మొత్తం ఓ రౌండ్‌ పల్టీలు కొట్టి నేలపై పడింది. దీంతో కొద్దిసేపటి వరకు అతడు నొప్పితో అల్లాడిపోయాడు. అటువైపుగా వస్తున్న కొందరు అతడి పరిస్థితి గమనించి అక్కడికి చేరుకునే లోపే జేమీ పైకి లేచాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియా ఒకటి వైరల్‌ అయింది. అయితే ఆ వీడియోను జేమీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రీపోస్ట్‌ చేస్తూ.. ‘ నేను దేన్ని తగులుకుని కిందపడ్డానో ఎవరికైనా తెలుసా?. అక్కడో ఛైన్‌ ఉంది. ఈ వీడియోలో మీరు దాన్ని చూడలేరు. నేను పరిగెత్తుతున్నపుడు దాన్ని చూడలేకపోయాన’ని తెలిపాడు. ఓ నెటిజన్‌ వేసిన కుశలప్రశ్నకు అతడు స్పందిస్తూ.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పాడు.

మరిన్ని వార్తలు