లాక్‌డౌన్‌ : జూమ్‌‌ ద్వారా నిందితుడికి ఉరిశిక్ష

20 May, 2020 12:15 IST|Sakshi

సింగపూర్‌లో ఒక వ్యక్తికి ఆ దేశ సుప్రీంకోర్టు జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉరిశిక్ష విధించింది. కరోనా నేపథ్యంలో సింగపూర్‌ దేశం లాక్‌డౌన్‌లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్‌ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే, మలేషియాకు చెందిన 37 ఏళ్ల పునితాన్ జెనాసన్ 2011లో హెరాయిన్‌ డ్రగ్‌ను అక్రమంగా సరఫరా చేయడంపై అప్పట్లో అతనిపై కేసు నమోదయింది. అప్పటి నుంచి విచారణ జరుగుతున్న ఈ కేసులో ఆరోపణలు రుజువైన కారణంగా పునితాన్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. (ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు)

దీనిపై సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి మాట్లాడుతూ, మా దేశంలో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండంతో ఎటువంటి కేసులను కోర్టు విచారణ జరపడం లేదు. అయితే ఈ కేసు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంతో తిరిగి విచారణ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో డైరెక్ట్‌ విచారణ సాధ్యం కాకపోవడంతో జూమ్‌ టెక్నాలజీని వాడాము. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అలాగే పునితాన్‌ జెనాసన్‌ తరపు న్యాయవాది ఎవరికి వారు జూమ్‌ ద్వారానే తమ వాదనలు వినిపించారు. నిందితుడికి సంబంధించిన అన్ని డ్యాక్యుమెంట్లు, ఆధారాలను జూమ్‌ ద్వారానే వివరించారు. ఆధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పునితాన్‌కు ఉరిశిక్ష విధించారంటూ' చెప్పుకొచ్చారు.
(కరోనా కల్లోలం‌: ఒక్కరోజులో వెయ్యి మరణాలు!)

దీనిపై పునితాన్‌ తరపు లాయర్‌ పీటర్‌ ఫెర్నాండో స్పందిస్తూ, జూమ్‌ ద్వారా తన క్లైంట్‌కు శిక్ష విధించడం సరికాదని, దీనిపై మరోసారి అప్పీల్‌కు వెళ్లునున్నట్లు చెప్పారు. సింగపూర్‌లో అక్రమ డ్రగ్‌ సరఫరాను ఆ దేశంలో ఎంత మాత్రం సహించరు. ఎవరైనా అలాంటి పనులు చేస్తూ పట్టుబడితే ఉరి తీయడానికి అక్కడి కోర్టులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దశాబ్ధం నుంచి చూసుకుంటే నార్కొటిక్‌ సరఫరా కేసులో వందల మందికి ఉరిశిక్షను ఖరారు చేశారు. వీరిలో డజనుకు పైగా విదేశీయులు ఉండడం విశేషం.

సింగపూర్‌లో కరోనా వేగంగా విస్తరించడంతో ఏప్రిల్‌ మొదటి వారంలోనే అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్‌ 1 వ తేదీ వరకు కొనసాగించాలని ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయించింది. సింగపూర్‌ దేశంలో చిన్న తప్పులకు కూడా ఉరిశిక్షలు అమలు చేయడంలో వారి క్రూరత్వం, అమానవీయమని ఏషియా డివిజన్‌ హ్యూమన్‌ రైట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఫిల్‌ రాబర్ట్‌సన్‌ పేర్కొన్నారు. జూమ్ వంటి రిమోట్ టెక్నాలజీని ఉపయోగించి మనిషికి మరణశిక్ష విధించడం ద్వారా ఇలాంటి శిక్షలు  మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
(మాస్క్ ధ‌రించ‌కుంటే రూ. 60,000 జ‌రిమానా)

మరిన్ని వార్తలు