అర్ధరాత్రి భారీ భూకంపం

16 Dec, 2017 09:47 IST|Sakshi

జకర్త : ఫసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర ప్రాంతంలో భూమి భారీగా ప్రకంపించింది. 

రిక్చర్ స్కేల్‌ పై దాని తీవ్రత 6.5గా ఉన్నట్లు నేషనల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది. పంగందరన్‌, తసిక్‌మలయా, కియామిస్, బంజర్‌, గౌరత్‌, కెబుమెన్‌, బన్యుమస్‌ నగరాలు భూకంపం దాటికి వణికిపోయాయి. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవటంతో ఇళ్లలోంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. 

జావాకు పశ్చిమాన ఉన్న తసిక్‌మాల్యాకు నైరుతి ప్రాంతంలో భూమికి 92 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు నిమిషానికి పైగా భూమి కంపించగా.. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం దాటికి ఇళ్లకు పగుళ్లు వచ్చేశాయ్‌. అలల తీవ్రతతో తీర ప్రాంత ఇళ్లలోకి నీళ్లు రావటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసి.. కొన్ని గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. 

ఘటనలో 40 ఇళ్లులు కుప్పకూలిపోగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది.  

కుప్పకూలిన ఇంటిలో సహాయక చర్యల్లో భద్రతా సిబ్బంది

భూకంపం అనంతరం బైకులపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు

మరిన్ని వార్తలు