కజికిస్తాన్లో తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం

2 Sep, 2016 10:56 IST|Sakshi

కజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేస్తున్న తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. కజికిస్తాన్లో ఎంబీబీఎస్ చేస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికి వచ్చిన తెలుగు విద్యార్థులు గురువారం తిరుగు పయనం అయ్యారు. అయితే వారిని యూనివర్శిటీ హాస్టళ్లోకి సిబ్బంది అనుమతించ లేదు. అడ్మిషన్ టైంలో కన్సల్టెన్సీ  చెప్పిన ఫీజుకంటే రెట్టింపు చెల్లిస్తేనే లోపలికి అనుమతి అంటూ రాత్రి సమయం అని కూడా చూడకుండా యాజమాన్యం హాస్టల్ రూమ్లకు తాళాలు వేసింది.

వర్షం కూడా కురవడంతో యూనివర్శిటీ బయటే చలిలో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం వరకైనా అనుమతి ఇవ్వాలని కోరినా, ఒప్పుకోకుండా దుర్భాషలాడారంటూ విద్యార్థులు(అబ్బాయిలు,అమ్మాయిలు) తమ తల్లిదండ్రులకు వాట్సాప్లో గోడువెల్లబోసుకున్నారు.

పిల్లల మెసెజ్లతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కజికిస్తాన్లో ఎంబీబీఎస్ లో చేర్పించిన ఎన్ఈఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. అయితే వారు కూడా  పట్టించుకోవటంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

200 మంది తెలుగు విద్యార్థులు ఎన్ఈఓ కన్సల్టేన్సీ ద్వారా గత ఏడాది కజకిస్తాన్లో ఎంబీబీఎస్లో చేరారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చి దాదాపు 50 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ నుంచి కజకిస్తాన్కు తిరిగి వెళ్లారు.

>
మరిన్ని వార్తలు