పాములతో సావాసం..బల్లులతో భోజనం!

9 Sep, 2018 02:32 IST|Sakshi

పాములు, కొండచిలువలు, బల్లులు, తేళ్లు.. వీటిని చూడగానే ఏమనిపిస్తుంది.. ఫస్ట్‌ భయం వేస్తుంది. కొందరికైతే వాటిని పుస్తకాల్లో బొమ్మలు చూడాలన్నా భయం, అసహ్యం అనిపిస్తుంది. మరి వాటితో కలసి భోజనం చేయాలంటే.. యాక్‌.. వామ్మో వాటిని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది భోజనం ఏంటి.. అసలు అన్నం తినకుండానైనా ఉంటాం కానీ.. అలాంటి తిక్క పనులు చేయమంటారా..? మీలాంటి వారి కోసం కాకుండా అవంటే ఇష్టం.. ప్రేమ ఉండే వారికోసం కంబోడియాలో ఓ రెస్టారెంట్‌ ఉంది. భోజనం చేయాలంటే అక్కడ ఉన్న కొండచిలువలు, పాములు, తేళ్లు వంటి సరీసృపాలతో కలసి కూర్చునే ధైర్యం కూడా కావాలి.

ఎంచక్కా కొండచిలువను మెడలో వేసుకుని, టేబుల్‌పై పెట్టుకుని మన ఆర్డర్‌ ఆరగించొచ్చు. ప్రాణహాని ఉంటుందన్న భయం లేకుండా హోటల్‌ యజమానులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ రెస్టారెంట్‌ లోపల గాజు అద్దాల డబ్బాల్లో వీటిని పెట్టారు. అవంటే భయం ఉన్నవారు దూరం నుంచే వాటిని చూసుకుంటూ తినేయొచ్చు. మరీ ఇలాంటి రెస్టారెంట్లు అవసరమా అని ప్రశ్నిస్తే.. ఈ ప్రాణులను జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... అవి కూడా మంచివే.. ఊరికే ఎవరికీ హాని తలపెట్టవని చెప్పేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశామని అంటున్నారు హోటల్‌ యజమానులు.

మరిన్ని వార్తలు