311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో

18 Oct, 2019 03:28 IST|Sakshi

మెక్సికో సిటీ: సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు తమ దేశంలో ఉండేందుకు సరైన అనుమతులు లేని భారతీయులను టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్‌ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్‌ జాతీయ వలసల సంస్థ (ఐఎన్‌ఎమ్‌) ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికన్‌ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ చర్యకు పూనుకుంది. సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతోపాటు వలసదారులను దేశంలోకి అనుమతించే పాలసీని సవరించాలని నిర్ణయించింది. అక్రమ వలసదారులను తిప్పి పంపించే విషయంలో భారతీయ దౌత్య కార్యాలయం మంచి సహకారం అందించిందని, కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు