బియ్యం కన్నా చిన్న కంప్యూటర్‌

24 Jun, 2018 03:16 IST|Sakshi
మిషిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన సూక్ష్మ కంప్యూటర్‌

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్‌ను అమెరికాలోని మిషిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. 0.3 మిల్లీమీటర్ల మందం ఉన్న ఇది బియ్యం గింజ కన్నా చాలా చిన్నది. ‘మిషిగాన్‌ మైక్రో మోట్‌’గా పిలుస్తున్న ఈ చిట్టి కంప్యూటర్‌ పనిచేసే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంది. సంప్రదాయ కంప్యూటర్లను ఆఫ్‌ చేసిన తరువాత కూడా వాటిలోని సమాచారం అలాగే భద్రంగా ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్‌ను ఒకసారి స్విచాఫ్‌ చేస్తే అంతకు ముందు చేసిన ప్రొగ్రామింగ్, డేటా అంతా అదృశ్యమవుతుంది. ఈ సూక్ష్మ కంప్యూటర్‌లో ర్యామ్, కాంతి విద్యుత్‌ ఘటాలతో పాటు ప్రాసెసర్లు, వైర్‌లెస్‌ ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్లను అమర్చారు. పరిమాణంలో చిన్నవి కావడంతో వీటిలో ఆంటెనాకు బదులుగా కాంతి సాయంతో సమాచార మార్పిడి జరిగే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కంప్యూటర్‌ను కేన్సర్‌ కణతుల పరిశీలన, చికిత్సలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు