సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరోసారి భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల చివరిలో వినియోగదారులు, యువ విజేతలు, విద్యార్థులు, డెవలపర్లు, వ్యవస్థాపకులను కలుసుకునేందుకు భారతదేశాన్ని సందర్శించనున్నారు. సత్యా నాదెళ్ల పర్యటనను ధృవీకరించి మైక్రోసాఫ్ట్ సంస్థ, ఆయన ఇండియాకు వచ్చే తేదీలు, పర్యటించే నగరాల గురించి వివరాలు ఇవ్వలేదు. అయితే ఫిబ్రవరి 24-26 వరకు నాదెళ్ల భారత్లో పర్యటించనున్నారని భావిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ, టెక్ హబ్ బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబై నగరాలను సందర్శించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా దేశంలో పరిశ్రమ పెద్దలతోపాటు, కొంతమంది ప్రభుత్వ కార్యకర్తలను కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు అంతేకాదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటికీ కూడా నాదెళ్ల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సత్య నాదెళ్ల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఇటీవల భారత పర్యటన సందర్భంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ఈ టెక్ దిగ్గజం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
చదవండి : సీఏఏపై సత్య నాదెళ్ల ఏమన్నారంటే..