మోదీ దౌత్యం.. పాక్‌కు శాపం

2 Jan, 2018 08:50 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని పాకిస్తాన్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అభిప్రాయపడ్డారు. మోదీ దౌత్యనీతి తమ దేశానికి శాపంగా మారిందని ముషారఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ అనుసరించిన విధానాలు.. పాక్‌ను అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాయని అన్నారు. 

పాకిస్తాన్‌ న్యూస్‌ ఛానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అంతర్జాతీయ దౌత్య విధానాలు అవలంభించడంలో మోదీతో తమ నేతలు పోటీపడలేకపోయారని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం నిష్క్రియా పరమైన దౌత్య విధానాలను అనుసరిస్తోందన్నారు. ప్రణాళిక లేని దౌత్య విధానాల వల్ల అంతర్జాతీయ ప్రపంచం నుంచి పాకిస్తాన్‌ దూరం జరిగిందని అన్నారు. 

‘పాకిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉందా? మన దౌత్య విధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ కన్నా దూకుడుగా ఉందా? నరేంద్ర మోదీ అంతర్జాతీయంగాక్త మన దేశాన్ని ఏకాకి చేయడం నిజం కాదా? ఇప్పటివరకూ కులభూషన్‌ జాదవ్‌ను గూఢచారిగా భారత్‌ గుర్తించలేదు.. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ మాత్రం లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా ఎందుకు గుర్తించింద’ని ముషారఫ్‌ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దూకుడుతో కూడిన దౌత్య విధానాలను పాకిస్తాన్‌ పాలకులు అనుసరించలేకపోవడం వల్ల నేడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. 

మరిన్ని వార్తలు