కౌలాలంపూర్: మలేసియాలో రాజకీయం రంజుగా సాగుతోంది. తొంభై నాలుగేళ్ల ముదిమిలోనూ మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాలని సర్వశక్తులు ఒడ్డిన మహాతీర్ మహమ్మద్కు చుక్కెదురు కాగా.... పెద్దగా గుర్తింపు లేని మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి మొహియుద్దీన్ యాసిన్ను శనివారం ప్రధాని పదవి వరించింది. ఈ ఆకస్మిక పరిణామంతో మలేసియాలో స్కామ్లలో మునిగిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లైంది. మొహియుద్దీన్ యాసిన్ ప్రధానిగా ఎంపిక కావడంతో అటు మహాతీర్ ప్రభ కొడిగట్టడమే కాకుండా... అతడి వారసుడిగా తనకు పదవి దక్కుతుందనుకున్న అన్వర్ ఇబ్రహీమ్ ఆశలకు గండిపడింది.